అంటరానితనం
(వైకోమ్ ఉద్యమ చరిత్ర)
1958 డిసెంబరు 25-26 తేదీలలో తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో పెరియార్ చేసిన ప్రసంగం.)
అధ్యక్షా! ప్రియమైన ప్రజలారా!
కానీ ఇతర జిల్లాల పర్యటనలో ఉండటంవల్ల నేనిక్కడికి రాలేకపోయాను. నేను కన్యాకుమారి జిల్లాకు రమ్మని ఇక్కడి కామ్రేడ్స్ నన్నెన్నోసార్లు ఆహ్వానించారు. పర్యటించిన చోట్ల ప్రజాచైతన్యం పెల్లుబుకుతోంది. అధిక సంఖ్యలో ప్రజలు మన సభలకు హాజరౌతున్నారు.
ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాల క్రితమే నేను అనేక సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా “అంటరానితనం” పై ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపాను. ఈనాటి వృద్ధులకు ఆనాటి దుర్మార్గపు ఆచార వ్యవహారాలు తెలిసే ఉంటాయి. ఇప్పటి యువతరానికి ఈ విషయాలు అంతగా తెలియవు. ఆనాటి దేశ పరిస్థితులు దారుణంగా ఉండేవి. సంప్రదాయ పరాయణులైన బ్రాహ్మణులు ప్రభుత్వాధికారంలో ఉండేవారు. వర్ణాశ్రమ ధర్మాలు కఠినంగా పాటించబడేవి. వేలాది సంవత్సరాలుగా మనల్ని కనీసం రోడ్లపై కూడా నడవనివ్వలేదు. ఆ రోజుల్లో తీవ్రమైన ఉద్యమం చేయబట్టే ఈరోజు మనం రోడ్లపై నడవగలుగుతున్నాం. ఆనాటి బ్రాహ్మణేతర ఉద్యమ ఫలితంగానే మనదేశంలో బ్రాహ్మణేతరులకు అనేక హక్కులు లభించాయి. బ్రాహ్మణాధిక్యతను బ్రాహ్మణేతర ఉద్యమం విజయవంతంగా ఎదుర్కొంది. ఈ బ్రాహ్మణేతర ఉద్యమం “జస్టిస్ పార్టీ”గా పేరు ప్రఖ్యాతులు గాంచింది.
బ్రాహ్మణులు కూడా బ్రాహ్మణ సమాజం, బ్రాహ్మణ మహాసభ వంటి సంస్థలు స్థాపించుకున్నారు. మన హక్కులకు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు నిలిచారు. న్యాయమైన మన హక్కులను వారు వ్యతిరేకించారు. తాము “గొప్పకులం" వారమని బ్రాహ్మణులు గర్వించేవారు. తమను బ్రాహ్మణులని పిలవాలనివారు నిర్దేశించారు. ద్రావిడ జాతికి చెందిన మనల్ని వారు ఎన్నో బాధలకు గురిచేశారు. మనల్ని వారు శూద్రులని పిలిచారు. మనుస్మృతి, ఇతర స్మృతులు కూడా మనకు శూద్రులని పేరు పెట్టాయి. బ్రాహ్మణరాజ్యం, వారి కార్యక్రమాలు మన జీవనాన్ని అభివృద్ధిని దెబ్బతీశాయి. ద్రావిడజాతికి చెందిన మనపై బ్రాహ్మణులు చేసిన మోసపూరిత కుట్ర ఫలితంగా మనం ఈ నాటికీ శూద్రులుగా పిలువబడుతున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు వారు మనల్ని ఎన్ని బాధలకు గురిచేశారో వర్ణించలేం..................