అమర్ అక్షరాలు మాట్లాడతాయి.....,!
అమర్ అక్షరాలు పాఠకునితో మాట్లాడతాయి, కదిలిస్తాయి. హాస్యంతో పాటు ఆనందం, ఆక్రందన, అసహనం, ఆవేశం, ఆకాశమే హద్దుగా ఆయన ఆలోచనలు
ఉంటాయి.
అమర్ గొప్పతనం ఏమిటంటే నిర్జీవమైన మీటలతో సరిగమలు పలికించినట్లు అమర్ అక్షరాలు బాపు నవరసాలు పలికిస్తాయి అని పాఠకుల భావన. శ్రీశ్రీ చెప్పినట్లు. కష్టజీవికి ఇరువైపులా నిలబడేవాడే కవి. అలాంటి కష్టజీవుల మధ్య నిరంతరం వుంటూ వారికి ఉపయోగపడుతూ, వారి అభ్యున్నతిని, అభివృద్ధిని కాంక్షించే వైతాళికుడు
అమర్.
అమర్ రాసిన ప్రతి అక్షరానికి ముడిసరుకు ఆయన స్వీయ అనుభవాలే. కష్టంగా రాయటం కష్టం, సులువుగా రాయటం నాకు ఇష్టం అంటూ ఆయన రాసిన ప్రతి అక్షరం వినిపిస్తే చదువురాని పేదవాడికి కూడా సులభంగా అర్థం కావాలనే విధంగా రచనా శైలి ఉంటుంది.
అమర్ ఎంతటి తీవ్రమైన సమస్య అయినా సులువైన, విలువైన పరిష్కారాన్ని హాస్యం జోడించి చెబుతారు. అందుకే ఆయన సన్నిహితులు ఆయనను వికటకవి తెనాలి రామకృష్ణునితోను, ఆధునిక హాస్యచక్రవర్తి చార్లీచాప్లిన్తోను పోలుస్తారు.
ఆయన ఒక పరిపూర్ణ మానవుడు. అసూయ, ద్వేషాలు, ఈర్ష్యలు ఆయనలో కనిపించవు. శత్రువుని సైతం మనస్ఫూర్తిగా పలకరించే సంస్కారం, శత్రువుతో సైతం మనస్ఫూర్తిగా గౌరవింపబడే వ్యక్తిత్వం అమర్కే సొంతం.
అమరనాథ్ రెడ్డి గారి గురించి రాయాలనుకున్నపుడల్లా నాకెందుకో పదాలు తడబడతాయి. 29 సంవత్సరాలుగా ఒకే ఆశయంతో, ఒకే లక్ష్యంతో, మనస్పర్థలు లేకుండా పనిచేస్తున్న మా ఇద్దరిని చూసి ఆశ్చర్యపడ్డమే కాక, లోన అసూయపడుతూనే అభినందిస్తున్న వివిధ సంస్థల నాయకులను చూసి నవ్వుకుంటుంటాం.
ఆయన పరిచయం నా జీవితాన్ని గొప్ప మలుపుతిప్పింది. అందుకేనేమో ప్రతిరోజూ నేను సారు కలవకుండా, మాట్లాడకుండా ఉండలేను. ఎంతో దగ్గరగా చూస్తూ ఉన్నాను. ఆయన ప్రతి అనుభవంలోనూ నేనున్నాను. ప్రతి సందర్భంలోను ఆయనపై గౌరవం రెట్టింపు అయితుంది.........................