ఉనికి లేముల నడుమ
-రబింద్రనాథ్ ఠాగూర్
రాణీహాట్ జమీందారు, శారదా శంకర్ గారి వితంతు కోడలికి పుట్టింటి వాళ్ళంటూ ఎవరూ లేరు; అందరూ ఒక్కొక్కరుగా కాలం చేశారు. అత్తవారి తరపున కూడా ఆమెకంటూ ఎవరూ లేరు - భర్తా లేడు, కొడుకూ లేడు, పెద్దబావగారి ఆఖరి కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. వాడు పుట్టినప్పటి నుంచి తల్లి జబ్బునపడటంతో వాడు కాకీమా అని పిలుచుకునే పిన్నిగారు కాదంబిని - వాడి బాధ్యతను స్వీకరించింది. పరాయివాళ్ళ బిడ్డను పెంచటంవల్ల అనుబంధం ఏర్పడుతుందేగానీ, ఆ బిడ్డమీద హక్కులేమీ దొరకవు; ప్రేమ వల్ల ఏర్పడే ఆపేక్ష తప్ప, సంఘం విధించే నిర్బంధమేమీ ఇందులో లేదు స్వచ్ఛమైన ప్రేమకు దాని హక్కులను నిరూపించుకునే రాతపూర్వకమైన ఆధారమేమీ ఉండదు, అలా ఉండాలని అది కోరుకోదు కూడాను. తన అభిమానానికి కారణమేమిటో స్పష్టంగా తెలియకపోయినా ఆ గాఢమైన అనుబంధం అలాగే ఉంటుంది.
ఒక వితంతువుగా తన హృదయంలో అణిచిపెట్టుకున్న ప్రేమనంతటినీ ఆ చిన్నారి బాలుడిపై కురిపించిన కాదంబిని, ఒక వర్షపురాత్రి అకస్మాత్తుగా మరణించింది. ఏ కారణంవల్లనోగానీ, ఆమె గుండె హఠాత్తుగా ఆగిపోయింది; లోకమంతా యథాతథంగా సాగిపోతూనే ఉన్నది. కానీ ప్రేమకొరకు నిరంతరంగా అలమటించిన - సుకుమారమైన ఆమె చిన్ని గుండె మాత్రం - శాశ్వతంగా ఆగిపోయింది.
పోలీసులు రావడం వంటి అమంగళకరమైన పనులు జరగకముందే జమీందారు వద్ద పనిచేసే నలుగురు బ్రాహ్మణులు శవాన్ని తీసుకుని దహన సంస్కారాలకు బయల్దేరారు.
రాణీహాట్ గ్రామంలోని శ్మశానం, జనావాసాలకు చాలా దూరంగా ఉంటుంది. విశాలమైన ఆ శ్మశాన భూమిలో చెరువు పక్కగా ఒక గుడిసె, దాని పక్కనే పెద్ద మర్రి చెట్టూ తప్ప, అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒకప్పుడు ఇటువైపున ఒక నది ప్రవహిస్తుండేది కానీ, ఇప్పుడది ఎండిపోయింది. ఎండిపోయిన ఆ నది గట్టుమీద ఒకపక్కగా గుంట తవ్వి, చెరువుగా తయారుచేశారు. నిండుగా పారుతుండిన ఆ నదికి ఈ చెరువునొక అధికారిక ప్రతినిధిగా భావిస్తారు జనం.
శవాన్ని గుడిసెలో వుంచి చితి పేర్చటానికి కట్టెలకోసం ఎదురుచూడసాగారు నలుగురు మనుషులు. అవి తెచ్చేవాళ్ళు ఎంతకూ రాకపోవటంతో ఆలస్యానికి కారణ...........................