మనస్సు : దేహం
మనస్సును దేహంనుండి విడదీయ వీలులేదు. మానసిక వ్యాపారం మస్తిష్క వ్యాపారమే. అంగజీవికి పరిసరాలతోగల క్లిష్ట సంబంధాల అవయవమే మేధ లేదా మెదడు.
ఒక జంతువుకు దాని ఇంద్రియానుభూతులు బాహ్య ప్రపంచంతో సంబంధపు ఒక సంకేతక్రమం ఔతాయి, మానవునిలోని అనుభూతి సంకేత క్రమంతోబాటు దాని సంకేత క్రమమైన శబ్దసంకేతక్రమం వృద్ధిచెందినది. ఇది పదార్థాల వాటి విభిన్న సంబంధాల గుణీకరణ -సామాన్యీకరణలద్వారా మానవ ప్రత్యేకమైన ఉన్నత మనోవ్యాపారానికి సాధనం ఔతుంది.
పదార్ధమూ, మనస్సు : ఇటీవలివరకూ అనేకమంది తాత్వికులు దేహము - ఆత్మ వేర్వేరని భావించారు. మానవుని దేహంలో విడిగా "ఆత్మ" అనే దొకటుంటుందని అనేక వాదనలు చేశారు. తత్వశాస్త్రంలో మెలకువ నిద్రలతోబాటు స్వప్నం అనే మూడవ అవస్థను గూర్చిన చర్చకూడా తరచు కొనసాగుతూ ఉంటుంది. ఒకమనిషి కలలో తాను ఆకాశంలో విహరిస్తున్నట్లు చూస్తాడు. కలల్లో ఇంకా అనేక అసంభవకార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ కలల్లోని "తాను" అనేదేమిటని ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా మానవశరీరంలో మరొక సూక్ష్మదేహం ఉంటుందన్న ఊహలు రూపొందాయి. దీన్నే "ఆత్మ" అన్నారు. ఆత్మ వాయుపదార్ధమనీ, తేజోవిశేషమనీ, జీవమనీ, ప్రాణమనీ, శక్తివిశేషమనీ, గుణమనీ తాత్వికులు అనేక నిర్వచనాలు చేశారు. ఆత్మ పరిమాణాన్ని గూర్చికూడ అణువంతనీ, గోధుమగింజంతనీ, అంగుష్టమంతనీ ఊహించారు. ఆత్మను జ్యోతిగాను, తామరపువ్వుగాను ఉత్ప్రేక్షించారు. అది జ్ఞానమనీ, దైవమనీ వర్ణించారు. ఇలా కొనసాగిన ఆత్మజిజ్ఞాస దేహంనుండి మనస్సును వేరుపరచింది. దేహం ప్రధానమా లేక ఆత్మప్రధానమా అన్న చర్చకుకూడా ఇది దారితీసింది.
కొందరు ఆత్మప్రధానం అన్నారు. దేహం జడమనీ, ఆ దేహంలోగల ఆత్మ చేతనమనీ విభజించారు. జడపదార్థమైన దేహం ప్రకృతి నియమాలకు లోనై నశించిపోతుందనీ, ఆత్మ అలాకాక ప్రకృతి నియమాలకు, పరిణామానికి, జనన మరణాలకు అతీతమైనదనీ అన్నారు. దేహం నశించినప్పటికీ ఆత్మ నశింపక జన్మాంతరాలను పొందుతుందనీ, ఉత్తరగతులను చేకూర్చుకుంటుందనీ వాదించారు. మీమాంసకులు వైదికకర్మవాదం కొనసాగించారు. వేదోక్త - పురాణోక్త కర్మాచరణద్వారా ఆత్మ స్వర్గ నరకానుభవాలను పొందుతుందనీ, కనుక శరీరధారియైన మనుష్యుడు మతకర్మలకు అధీనుడు కావాలనీ శాసించారు. యోగశాస్త్రం మానవుడు బహిక రాగద్వేషాలను మానుకొని, భౌతిక సుఖదుఃఖ వాంఛలను అణచుకొని, దేహాన్ని శుష్కింపజేసే యమ నియమ ప్రాణాయామ ..........................