గోదావరి నుంచి జావా దాకా...
ప్రయాణం...
జ్ఞాపకాలు మూటకట్టుకునే అపురూపమైన ప్రయాణం..
తేటతేట తెలుగు గుండె చప్పుడు ఎటు వినిపించిందో అటువైపు రెక్కలు కట్టుకుని దిక్కులు దాటుకునైనా వెళ్లి పసుపుకుంకుమల శోభతో అలరారే గడపగడపనీ ఆత్మీయంగా పలకరించాలనే ఆశతో ప్రారంభించిన ప్రయాణం..
మనదైన భాష ప్రపంచపటంలో ఎక్కడెక్కడికెళ్లినా ప్రతీ పదంలోనూ వినిపించే తెలుగందాలకు, తెలుగు సుగంధాలకు మాతృభూమితో అనుబంధాన్ని మరోసారి ముడివేసి, మరింత బలంగా చేసి తెలుగుతల్లికి మల్లెపూదండ వేసి, మంగళహారతులు పట్టాలని ఎంతో ముచ్చటగా ఉప్పొంగిన ఉత్సాహంతో శ్రీకారం చుట్టిన ప్రయాణం..
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అని నిత్యం స్మరిస్తూ.. భాషామృతాన్ని తాగిన రుణంతో తెలుగుతల్లిని అనుక్షణం కీర్తిస్తూ మూలాలను మర్చిపోని ప్రతి గుండెకు చెయ్యెత్తి నమస్కరించి, తల్లి నేల నుంచి మీ ఇంటికో బంధువొచ్చింది అని ఓసారి గుర్తు చేసి వాళ్లు చెప్పే బోలెడు కబుర్లు, ఎప్పడెప్పవో విశేషాలు ఇక్కడికి తేవాలని కట్టిన ప్రయాణం..
ఈ నేల నుంచి దేశదేశాలకు తరలి వెళ్లిన తెలుగు పరిమళాన్ని అక్షరాలుగా మార్చి ఎన్నో యేళ్ల తరువాత మళ్లీ ఈ నేలకు పరిచయం చేయాలనే సంకల్పంతో మొదలుపెట్టిన ఉల్లాసభరితమైన ప్రయాణం..
నా దేశం కరుణాంతరంగ.. నా దేశం సంస్కారగంగ.. అని ప్రణతులతో దివ్య నీరాజనాలర్పించిన మహోన్నత చరితనీ, తియ్యని తెలుగుతో మమేకమైన..............