'ఎత్తి పొడుపు' కథలు!
అన్నీ వెక్కిరింతలే. వెవ్వెవ్వెలే. అలా కథలయిపోయాయంతే. వెక్కిరింత నేర్పిస్తే వచ్చేది కాదు. ఒక్క కాలు మీదే నిలబడి తపస్సు చేసినా రాదు. దానంతటదే అబ్బుతుంది. విన్నవాళ్ళూ, చదివిన వాళ్ళూ- ఓహో వ్యంగ్యం కాబోలు అని గుర్తిస్తారు. కాదు కాబోలు అన్నా, వెక్కిరింతల వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు.
పతంజలికి మారు పేరు కాదు. అసలు పేరే వెక్కిరింత. పొడవకుండా, ఎత్తి పొడవకుండా ఎవర్నీ పలకరించడు. కడకి తనను తాను కూడా అలాగే పలకరించుకుంటాడు. తన మీద తాను హాస్యాలాడుకోలేని వాడు హాస్యమే రాయలేడు. ఇంక వ్యంగ్యం కూడానా?
'ఆంధ్రప్రభ దినపత్రికలో ఆయనా నేను కలసి పనిచేస్తున్నాం. ఆ పత్రిక పునరుద్ధరణకు కొత్త యాజమాన్యం తెచ్చుకున్న సంపాదకుల్లో నేనూ, పతంజలీ వున్నాం. పక్కపక్కనే అయినా, ఎవరి గదులు (క్యాబిన్లు) వాళ్ళవి. ఆయనేమో అగ్నిహోత్రుడాయె! సిగరెట్టు వెలుగుతూనే వుండేది. నిప్పు ఆయనదీ, పొగ నాదీను. పొగతో పాటు మాటలు కూడా ప్రసారమయ్యేవి. ధూమ సందేశాలన్నమాట. అవే సంభాషణలు కూడా.
'ఉదయం (పత్రిక) మూతబడే వరకూ మీరున్నారా?' అని అడిగాను ఒకసారి ఊరికే. 'ఉదయాన్ని కాదు, పులిని నేను - బొబ్బలి పులిని చంపిన వాణ్ణండీ!' అన్నాడు. (దాసరి నారాయణరావు సారథ్యంలో ఉదయం దినపత్రికే కాదు, 'బొబ్బిలి పులి' మ్యాగజైన్ కూడా వచ్చింది. ఆ పత్రికకు పతంజలే సంపాదకుడు.) అలా తనని తాను వెక్కిరించుకోవటానికి ఏ మాత్రం వెనకాడడు.
తిట్టుకే కాదు, పొగడ్తకూ వెక్కరింతే.
ఇది జరిగి ఇరవయ్యేళ్ళ కిందటే, మొదట పతంజలిని 'ఉదయం' కార్యాలయంలో చూశాను. ఆయన కూడా నన్ను చూడటం అదే మొదటి సారి.
బక్కగా, సన్నగా ఆకలితో నకనకలాడు
'మీ రాతలు చదివాను. వాటిని బట్టి మీరు తున్నట్టుండాలే! బాగా ఉబ్బి వున్నారే!" అన్నాడు నన్ను చూసి. ఎనభయ్యవ దశకం కదా? విప్లవ సాహిత్యం ఇంకా రచయితల నడినెత్తినే వున్న రోజుల్లెండి! రచనలాగే, రచయిత కనిపించాలంటే, నాలా 'ఉబ్బి తబ్బిబ్బయి వుండకూడదు కదా?
నేను వెళ్ళేసరికి ఆయన తలవంచుకుని తెగ రాసేస్తున్నాడు.
'బిజీగా వున్నట్టున్నారు? మీ పని చెడగొట్టినట్టున్నాను.' అన్నాను ముఖమాటం వెలగబెడుతూ........................