కోడి రామ్మూర్తినాయుడు
3 నవంబర్ 1882 శనివారం
ప్రపంచంలో వేలమంది శిశువులు ఆ రోజు జన్మించారు.
అప్పటికే పలుదేశాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేవి. కానీ, భారతదేశంలో ఇళ్లల్లోనే పెద్దవయస్సు మహిళల అధ్వర్యంలో, మంత్రసానులు, భూబమ్మలు నేతృత్వంలో గర్భిణీలు బిడ్డలను కనేవారు. ఈ ప్రసవాలన్నీ దైవాధీనాలుగానే సాగేవి. ఆ రోజు తల్లిగర్భంలోంచి బయట పడి కళ్లువిచ్చుకున్న శిశువులు ఎందరో కాగా, పురిటిలోనే నానాయాతనలకు గురయి జన్మించిన శిశువులు కొందరు ఉన్నారు. ఇలా ఆ రోజు బిడ్డల ప్రసవాలు దేశమంతా జరిగాయి. వారిలో వెనుకబడిన జిల్లాగా పేరుపడిన గంజాం జిల్లాలో ఓమూలకు విసిరేసినట్లుండే వీరఘట్టం గ్రామంలో ఒక సామాన్య గృహిణి పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
తానుపుట్టిన పురిటిగడ్డకు ఎనలేనిపేరు తెస్తానని ఆ బిడ్డకు తెలియదు. ఆ కుటుంబీకులకు, ఆ గ్రామస్థులకు అసలే తెలియదు.
ప్రతి భారతస్త్రీ ప్రసవించేటప్పుడు చావోబతుకో అనే భీతితోనే పిల్లల్ని కనేవారు. అప్పటికి సిజేరియన్ ఆపరేషన్లు లేవు. సరైన ఇంగ్లిష్ మందులు ఇంకా జనాల్లోకి రాలేదు. వచ్చినా సూదిమందులపై భయపడేవారు. పాతవిధానాల్లోనే ప్రసవాలు జరిగేవి. వాటినే నమ్మేవారు.
ఆ రోజుల్లో దేశప్రజలకు నాటువైద్యమే గతి. నమ్ముకున్న దేవుడే పెద్దదిక్కు గ్రామదేవతలకు కోళ్లు, గొర్రెలతో మొక్కులు తీర్చుకుంటామని సుఖప్రసవం కోరుతూ మొక్కుకునేవారు..............................