బాల్యం గార్డెన్లో పూసిన జ్ఞాపకాలు
మేము పీలేరునుంచి తిరుమలకొండకు పొయ్యేసరికి సాయంత్రం నాలుగ్గంటలయింది. వెళుతూనే మా మామా వాళ్లింట్లో స్నానం చేసేసి దేవుడి దర్శనానికి వెళదామనుకున్నాను. మా మామా, అక్కావాళ్లు బెంగళూరుకి పోయినారు. మా మామ ఉండిఉంటే దర్శనం ఈజీగా అయిపొయ్యేది.
ఇప్పుడెలా అనుకుంటుంటే "మీ యశోదా పిన్నమ్మ దగ్గరికి వెళదాం! ఆ పిల్ల పంపిస్తుందిలే దర్శనానికి నిన్ను” అని చెప్పింది మా అమ్మ.
మా అమ్మ, నేను మా యశోద పిన్నమ్మను వెతుక్కుంటూ బయలుదేరాము. “ఇప్పుడు పిన్నమ్మ ఎక్కడమ్మా డ్యూటీ చేసేది?" అని అడిగినాను.
"మీ స్కూల్ వెనక కొత్తగా మ్యూజియం కట్టినారు కదా! ఆ మ్యూజియంలో మీ పిన్నమ్మకు డ్యూటీ" అని చెప్పింది.
మా అమ్మా, నేను గుడిముందుకు వచ్చినాము.
ఏకే47 గన్స్ పట్టుకుని గుడిని కాపలా కాస్తున్న పోలీసు దళాలను చూస్తుంటే ఇది కాశ్మీరా ! తిరుమలకొండా అనిపించింది.
ఇది నా చిన్ననాటి గుడేనా? ఇది నేను పుట్టిన ఊరేనా? అనిపించింది.
ఆదిశేషుడిలాగా కొండంతా మెలికలు తిరిగి సర్వదర్శనం క్యూ మహాద్వారం నుంచి మెల్లగా గుడిలోకి కదులుతోంది. గుడిలోకి వెళుతున్న వాళ్లల్లో, గంటల తరబడి క్యూలో నుంచున్నామన్న అసహనం, చిరాకు, విసుగు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు.
ఇంకాసేపట్లో దేవున్ని చూస్తామన్న ఆనందంతో వాళ్ల ముఖాలు చిదిమి దీపం..............................