అధ్యాయం - 1
'మున్ముందు మరో జన్మ అన్నది ఒకటి వున్నట్టయితే అటు మగవాడూ కాని, ఆడదీకాని జీవిగా జన్మించి నిన్ను చంపుతా'.
నిదానంగా కన్నులు విప్పి చుట్టూ చూచిన భీష్మునికి జ్ఞాపకానికి వచ్చిన మాటలవి.
అలా పడుకొనే ఎడమ చేతితో తన ఛాతీని మృదువుగా నిమురుకోసాగాడు. నొప్పి పెడుతున్నది. చాలా బాధ కలుగుతున్నది. తన గుండెకు తగిలిన బాణం అలాగే ఛాతీలో గుచ్చుకొని వున్నది. అది తన గుండెలోనికి చొచ్చుకొనిపోగా, దానిని యీడ్చివేయాలని తను చేసిన ప్రయత్నం విఫలమవడం జ్ఞాపకానికి వచ్చినది. ఇపుడు దానిని పీకి వేద్దునా అని తన కుడిచేతిని బాణం వద్దకు తీసుకొని పోగా, అతడు ఆత్రుతతో అక్కడికి వచ్చాడు.
'చాలా నొప్పి పెడుతున్నదా తాతా? కొద్దిగా సహించుకోండి. ఆ బాణాన్ని పెరికి వేయకూడదని రాజవైద్యులు తెలిపారు. గాయం కలిగినచోట పూయడానికి లేపనం తయారు చేస్తున్నారు. మీ నొప్పిని తగ్గించే మాత్రలను, కషాయాన్ని కూడా వైద్యులు తయారు చేస్తున్నారు'.
దుర్యోధనుని మాటలకు స్పందించి భీష్ముడు అతడిని సూటిగా చూచాడు. అతని కనుబొమలు పైకి లేచాయి. మాట్లాడాలని నోరు విప్పగా స్వరం బయటకు రావడం లేదు. నీళ్ళు కావాలని సంజ్ఞ చేశాడు. ప్రతీహారి దగ్గరే వుంచిన కూజానుండి నీటిని ఒక పాత్రలో వంచి యిచ్చాడు. నీటిని త్రాగడానికై లేవడానికి ప్రయత్నించగా అసాధ్యమైన నొప్పి అతడిని బాధించింది. దుర్యోధనుడు వెంటనే మంచం వద్దకు వచ్చి భీష్ముడి తలను తన తొడపై వుంచుకొన్నాడు.
'కషాయం త్రాగితే యింతగా నొప్పి వుండదు తాతా. ఇపుడు నోరు తెరవండి. నేను నీళ్ళు త్రాగిస్తా'.
అలా నీళ్ళు త్రాగుతుండగా కొద్దిగా నోటిలోనుండి నీళ్ళు బయటకు ఒలికాయి. ఒలికిన నీటిని దుర్యోధనుడు తన ఉత్తరీయంతో తుడిచాడు. భీష్ముని కన్నులతో అతడి కన్నులు కలిశాయి. వాటిలో బాధ నిండివుంది. భీష్ముడు నిదానంగా మాట్లాడసాగాడు........................