ఒక విభిన్నమైన బలి
'ఖణేల్' మంటూ ప్రత్యర్థులు కత్తులు దుయ్యటంతో ప్రారంభం అవలేదు. ఒక హంతకుడు తన అంగీలో దాచిన బాకుతో పొడవడంతో ప్రారంభం అయ్యింది.
జెరూసలెంలో పండగ వేళ ఆ సమయంలో మధ్యధరా తీర ప్రాంతంలో ఉన్న
యూదులంతా దేవునికి చక్కటి కానుకలు సమర్పించడానికి ఈ పవిత్ర నగరానికి పోటెత్తుతారు. సనాతన యూదు సాంప్రదాయం ప్రకారం ఏటా జరిపే కొన్ని వేడుకలు, అనుష్ఠానాలు కేవలం జెరూసలెంలోని ఆలయంలోనే, ప్రధాన పూజారి సమక్షంలోనే జరగాలి. అతను పస్కా, పెంతెకోస్తు, సుక్కేటు పంటల పండుగ మొదలైన అతి పవిత్ర పండగ దినాలను తన కోసం పోగుచేసుకుంటూ, అదే సమయంలో తన కష్టానికి భక్తుల నుంచి తగినంత ప్రతిఫలం (టైధ్) వసూలు చేస్తూ ఉంటాడు. అబ్బ, అసలు అదెలాంటి కష్టం అనుకుంటున్నారు ! ఇలాంటి పుణ్యదినాల్లో ఆ నగరంలోని జన సంఖ్య మిలియన్ దాటే ఉంటుంది. ఈ భక్తుల ప్రవాహాన్ని ఆలయం తాలూకు దక్షిణ గోడ వద్ద ఉన్న హల్దా గేట్ల గుండా, ఆలయ ప్రాంగణం క్రింద ఉన్న చీకటి గుయ్యారాల్లాంటి వరండాల్లోంచి తోసుకుంటూ 'అన్యజనుల ఆవరణ' గా పిలవబడే అంగడి లేదా కూడలి ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి వందల కొద్దీ కూలీలు, కిందిస్థాయి పూజారులకు తల ప్రాణం తోకకు వచ్చేది.
జెరూసలెం ఆలయం సుమారు 500 మీ. పొడవు, 300 మీ. వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార కట్టడం. ఇది పవిత్ర నగరానికి తూర్పు అంచున కల మొరియా కొండపై ఉంది. దీని ప్రహరీని చుట్టి మెరిసే తెల్లటి స్తంభాలతో కూడిన వరండాలు ఉన్నాయి. ఆ వరండాలన్నీ చక్కటి పైకప్పులు కలిగి ఉండడం వలన భక్త బృందాలు ఎండకు మాడిపోకుండా ఉంటారు. ఆలయానికి దక్షిణం వైపున 'రాయల్ పోర్టికో" గా పిలవబడే పొడవైన రెండంతస్థుల సమావేశ మందిరం ఉంటుంది. ఇది రోమన్ పద్ధతిలో నిర్మించబడి ఉంటుంది. ఇది 'శాన్డ్రిన్' యొక్క కార్యనిర్వహక భవనం కూడా. శాన్ హెడ్రిన్ అనేది యూదుల యొక్క అత్యున్నత మత సంస్థ. ఇంకా యూదు జాతీయుల అత్యున్నత న్యాయస్థానం కూడా. భక్తులు భూగర్భంలోని మెట్లెక్కి చక్కగా వెలుగుగా ఉన్న................................