నిజాం రాజ్య విలీనానికి ముందు - ఆ తర్వాత
(17 సెప్టెంబర్ 1948...)
నిజాం హైద్రాబాద్ సంస్థానం 17 సెప్టెంబర్ 1948న ఇండియన్ ఇ యూనియన్లో విలీనమైన తర్వాత, కాలగమనంలో 77 సంవత్సరాలు లీనమై పోయాయి. ఏటా 17 సెప్టెంబర్ను విలీన దినోత్సవంగా గుర్తు చేసుకుంటున్నాము. అయినా, ప్రతి సంవత్సరం రాజకీయంగా ఆ రోజు విముక్తా, విలీనమా, విద్రోహమా అనే మీమాంస కొనసాగుతూనే ఉంది.
ఎవరికి వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం, చారిత్రక వాస్తవాలను దాట వేస్తున్నారు. అసలు ఆనాడు నిజాం లొంగిపోయి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ముందు చేతులు జోడించి నమస్కరించి, తన రాజ్యాన్ని 'విలీనం' చేసిన నిజాన్ని విస్మరిస్తున్నారు.
ఆర్య సమాజీయులు, ఆర్.ఎస్.ఎస్. శ్రేణులు నిజాంను గద్దె దింపి, ముస్లింలను ఓడించిన దినమని, ఒక 'విముక్తి దిన’మని ఈ రోజు దాకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని ఆనాటి ప్రజల తిరుగుబాటును, రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందు-ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రిస్తున్నారు. కానీ యథార్థం మరో విధంగా చెబుతున్నది. ఆనాటి ఆ పోరాటం ఖాసీంరజ్వీ రజాకార్ల మూకలకు, నిజాం నవాబుకు, కులీన హిందూ భూస్వాములకు, దేశముఖ్ పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాయుద్ధం!
తెలంగాణలో రాజ్యాధికారాన్ని సాధించే దిశలో ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, ఫ్యూడల్ నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించింది. కాంగ్రెస్ అనుయాయులు, ఆర్య సమాజీయులు మొదలైనవారు తమ తమ పద్ధతుల్లో తిరుగుబాటు చేశారు. తెలుగుభాష సంస్కృతి పునరుద్ధణలో ఆంధ్ర మహాసభ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించింది.....................