ఇది అంకెల గారడీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
ప్రస్తుతం భారత ఉపఖండంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా ఎన్నో అవిశ్వసనీయమైన (నీతిమాలిన) ప్రత్యేకతలనే dubious distinctions ఈ దేశవాసులను వెర్రివాళ్ల కింద జమకట్టేశాయి. కేవలం స్వప్రయోజనాల కోసం పచ్చి అవకాశవాద రాజకీయాలను నిస్సిగ్గుగా ఆచరిస్తున్న నాయకులు ఈ రోజు అన్ని పార్టీలలో తిష్ఠవేశారు. ప్రజాస్వామిక విలువలను బేరమాడి తక్షణ ధనార్జన కోసం ఎటువీలైతే అటే దూకుతున్న ప్రజాప్రతినిధులు కొందరు! కప్పలను త్రాసులో తూచే ప్రయత్నం చేస్తే ఎటైనా సునాయాసంగా దూకే ప్రయత్నంలో వుంటాయి. అలాంటి నైజాన్ని మన నేతలు ప్రతినిధులు మూకుమ్మడిగా పుణికి పుచ్చుకున్నారు. కేంద్రంలో ఏర్పడుతూ కూలుతున్న సంకీర్ణ ప్రభుత్వాల నాటకాలను పరిశీలిస్తూ వుంటే ఊసరివెల్లి రాజకీయాలు గుర్తుకొస్తున్నాయి. చివరికి భారత ప్రజాస్వామ్యం కప్పల తక్కెడ ప్రజాతంత్రంగా మారిపోగా, ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇక దిక్కెవరు? అని ప్రజలు అడుగుతున్నారు. దిక్కుతోచని స్థితిలో వున్న ఈ ప్రజాస్వామ్యంలో అసలు లోపం ఎక్కడున్నదో ఒక్కసారి మూలంలోకి వెడితే, వర్తమాన అస్తవ్యస్త అరాచకత అర్థమవుతుంది. ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు తగలేసి, ఓటర్లను కొనేసే తతంగం నిరాటంకంగా కొనసాగుతున్నంత కాలం రాజకీయాలలో నీతి నియమాలకు చోటు వుండదు. విపరీతంగా పెరిగిన ఎన్నికల వ్యయాన్ని అదుపు చేయలేనపుడు ఆ తర్వాత ప్రజాప్రతినిధుల అక్రమ ఆర్జనను అరికట్టలేదు. ఎన్ని రెట్లు ఎన్నికల ఖర్చు పెరిగిందో ఈ కింది ఉదాహరణ అద్దం పడుతుంది. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అనుభవంతో ఇలా చెబుతున్నారు
"మా నాన్నగారు ఒక ఆదర్శ గాంధేయవాది! ఆనాటి నెహ్రూ కాంగ్రెస్లోని సోషలిస్టు భావాలకనుగుణంగా నడిచినవాడు. 1951లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీచేసి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆ రోజుల్లో ఆయన ఎన్నికల ఖర్చు మొత్తం అక్షరాల.....................