చిత్రకారుని చిత్రతపస్సును స్వప్నిస్తూ...
చిత్రలేఖనం పట్ల ఆసక్తి వున్నా వాటిని చూడటంలోనూ, శీలావీ వేస్తుంటే గమనించటంలోనూ, ఆయన చిత్రాలు మీద వస్తోన్న ప్రతిస్పందనల్ని ఒడిసి పట్టటంలోనూ మాత్రమే శ్రద్ధ పెట్టాను.
వీర్రాజుగారు అక్షరసంపెంగలను రంగుల పేపర్లలో పొందికగా అల్లి పంపిన ప్రేమ పరిమళాలు నన్ను ఆవరించటానికన్నా ముందే, చేతిలో చేయేసి నాతో నడకదారిలో అడుగులో అడుగులు కలపక ముందే లేపాక్షిసుందరులతో చూపులు కౌగలింతల్ని పేపర్ల నిండా చిత్రించారు.
రామప్ప నాగకన్యకలను మెడలో చుట్టుకున్నారు. అజంతా, ఎల్లోరా శిల్పాలను కథన పుష్పాలతో అభిషేకించారు.
అయితేనేం వివాహానంతరం కోణార్క శిల్పదంపతులను మాత్రం నా కళ్ళ ముందుకు ఆహ్వానించారు.
తర్వాత్తర్వాత ఎప్పుడైనా ఏ దేవాలయాలకైనా వెళ్ళినా చేతిలో స్కెచ్ బుక్ పట్టుకున్నప్పుడు అనిమేషుడైన శిల్పంలా తన చూపులోనే శిల్పాలను చెక్కుతోన్న శీలావీని ఒక మౌనమునిగా చూస్తూ నేనూ నిశ్చలన శిల్పాన్నైపోయేదాన్ని.
డ్రాయింగ్ బోర్డుపైన పేపర్ల నిండా ముఖచిత్రాలకోసం గీసిన రేఖల మధ్య చిక్కుకు పోయినప్పుడు చూపూ, మనసూ, ఆలోచనా ఒకేచోట కేంద్రీకరించిన రుషిలా కనిపించే వారు.
2010 సంవత్సరానికి వచ్చేసరికి ముఖచిత్రాలు పద్ధతి మారి ఫొటోలు,డిజిటల్ చిత్రాల వైపు సాహితీవేత్తలు ఆకర్షితులు కావటంతో.........................