వివేకమందిరం
పలకమారిన మొక్కజొన్న పొత్తులు మలి సంధ్యవేళ కొండగాలికి లయబద్ధంగా తలలూపుతున్నాయి. గాలి పెరిగితే ఏటవాలు, తరిగితే పక్కచూపు, లేకుంటే నిటారు, వాటి సయ్యాట కోనలో చెట్టూపుట్టలకు అసూయే. కాస్తా ఆలస్యంగా పొడుస్తున్న పొత్తులు రేకులను చీల్చుకుని పోగులతో బయటపడుతూ ఆట, సయ్యాటలకు సిద్ధమౌతున్నాయి. మొన్నటివరకు చిలకాకుపచ్చ తొడిగిన మొక్కజొన్న చేను క్రమేపి పసుపురంగును పులుముకోవడం ప్రారంభించింది. భూమిలో విత్తు మొక్క తొడిగిన తొలినాళ్ళ ఆకులు రేకులై ఎండా, వాన, చలికి కాండానికి రక్షణ కల్పించి, పొత్తు వేసిన తరువాత గోధుమ రంగుగా మారి, పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవడానికి మొక్కను వదిలి నేలరాలి పోతున్నాయి. మరికొన్ని మలినాటి రేకులు పటుత్వం తగ్గి పసుపురంగులోకి మారి కొండగాలికి గలగలమంటూ శబ్దం చేస్తున్నాయి.
ఈ ఏడు కురిసిన ఒకటి, రెండు వర్షపు జల్లులకు పగటి సూర్యకిరణాలను, రాత్రి మంచు బిందువులను సరిగానే వినియోగించుకున్న మొక్కజొన్న చేను సరైన దుబ్బుకట్టి ఆరోగ్యంగా ఎదిగి మూరెడు పొత్తులను పొదిగింది. మలి సంధ్యకిరణాలు నిలువెచ్చని కొండగాలికి పొత్తులు చేస్తున్న నాట్యానికి, చేను మధ్యలో అక్కడక్కడ ఉన్న వేపచెట్ల మీద కూర్చున్న రామచిలుకలు ఏ పొత్తుపై వాలి ఎన్ని గింజలు తినాలో లెక్క వేసుకుంటున్నాయి. బహుశ జామకాయల తరువాత వాటికి ప్రీతిపాత్రమైన ఆహారం మొక్కజొన్నలేమో! పిల్లల్ని వెంటబెట్టుకుని వచ్చిన తల్లులు పాలు పొదిగిన గింజల పొత్తుల కోసం చెట్టుమీద కూర్చుని సర్వే చేస్తున్నాయి. ఇవేమీపట్టని గోరింకలు ఎక్కడవాలితే తమ కడుపులు నిండుతాయోనని అంచనా వేస్తున్నాయి.
అక్కడెక్కడ చూసినా కొండలు, కోనలే. మనుషులు, జంతువుల నడక కోసం నలిగిన దారులు తివాచి పరిచి నేలన పచ్చదనం, నింగిలో నీలం రంగు తప్ప అక్కడ ఇంకో.........................................